మత కలహాలు సృష్టించేందుకు కుట్ర

మత కలహాలు సృష్టించేందుకు కుట్ర



తిరుపతి సెంట్రల్‌: రాష్ట్రంలో మత కలహాలను సృష్టించేందుకు ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కుట్రలు పన్నుతున్నారని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఆంధ్రజ్యోతి యాజమాన్యం తొత్తుగా మారిందని మండిపడ్డారు. ప్రభుత్వాన్ని, టీటీడీ పాలక మండలిని వేలెత్తి చూపడానికి ఏ కారణాలు లేకపోవడంతో కలియుగ దైవమైన శ్రీ వేంకటేశ్వర స్వామిపై స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం తిరుపతి పద్మావతి అతిథి గృహంలో ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌తో కలిసి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా చేతిలో పత్రిక ఉందని తప్పుడు వార్తలను ప్రచురిస్తే ఉపేక్షించేది లేదని ఆంధ్రజ్యోతిని హెచ్చరించారు. టీటీడీపై బురదజల్లే కార్యక్రమాలకు పాల్పడితే సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్‌ చర్యలు తీసుకుంటామన్నారు. టీటీడీ వెబ్‌సైట్‌లో 'యేసయ్య' అనే పదమే లేదని స్పష్టం చేశారు. టీటీడీ క్యాలెండర్‌లో గానీ, వెబ్‌సైట్‌లో గానీ ఆ పదం ఉంటే చూపాలని సవాల్‌ విసిరారు.