అమరావతి : బస్సు యాత్రలో చంద్రబాబు నాయుడుపై రాళ్లు, చెప్పులతో దాడి చేసింది ఆయన చేతిలో మోసపోయిన రైతులే అని మంత్రి కొడాలి నాని అన్నారు. మోసం చేశారనే కోపంతో రైతుల దాడి చేస్తే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు దాడిచేసినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నాయకులు దాడులు చేయాలనుకుంటే జిల్లాల పర్యటనలో చేయలేమా అని ప్రశ్నించారు. తమ పార్టీ నేతలకు గానీ, పోలీసులకు గానీ అలాంటి ఆలోచననే లేదన్నారు.
చంద్రబాబు ఎన్ని డ్రామాలు ఆడినా.. వైఎస్ జగన్ ప్రభుత్వాన్ని ఏమీ చేయలేరని అన్నారు. లోకేష్ ట్విటర్, యూట్యూబ్లకు మాత్రమే పరిమితం అవుతారని ఎద్దేవా చేశారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కూడా మూడు నెలలకోసారి బయటకు వచ్చి ఏదో మాట్లాడుతారు తప్ప ఏమీ చేయడని విమర్శించారు. చంద్రబాబు తా అంటే పవన్ తందానా అంటారని ఎద్దేవా చేశారు. వర్షాల వల్లే ఉల్లిపాయల సమస్య వచ్చిందన్నారు. ఇతర రాష్ట్రాలలో కంటే మెరుగ్గా రూ.25కే కిలో ఉల్లిని అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.